నవగీతం, కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన స్థానిక తహసీల్దార్ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.ఇందిరానగర్ కాలనీలో దాదాపు 100కు పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా, ప్రతి నెలా బియ్యం పొందేందుకు గ్రామంలోని ప్రధాన రేషన్ దుకాణానికి రావాల్సి వస్తోందని తెలిపారు. దీని వల్ల ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భారీగా బియ్యం మోసుకెళ్లడం వారికి కష్టసాధ్యంగా మారిందని వివరించారు.కాబట్టి నెలలో ఒక్కరోజైనా ఇందిరానగర్ కాలనీలోనే రేషన్ పంపిణీ నిర్వహిస్తే లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సర్పంచ్ వినతిపత్రంలో తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ స్పందిస్తూ, వచ్చే నెల నుంచి ఇందిరానగర్ కాలనీలో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.

