న్యాయ పరిశోధనలో మైలురాయి
మెట్ పల్లి పోలీసుల ఘన సన్మానం
నవగీతం,మెట్ పల్లి:
న్యాయశాస్త్ర రంగంలో మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు చేసిన విశేష కృషికి దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మెట్ పల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. డి.నాగేశ్వరరావు రచించిన తీర్పులలో పరిశోధనా వ్యాస ప్రస్తావన “Different Aspects of Section 173(8) of the CrPC” అనే పరిశోధనా వ్యాసాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు తమ ఇటీవల తీర్పులలో ప్రామాణికంగా ప్రస్తావించడం విశేషం. భారత సర్వోన్నత న్యాయస్థానం ‘తమిళనాడు రాష్ట్రం vs హేమేంద్ర రెడ్డి’ (2023) కేసులో సెక్షన్ 173(8) పరిధిని వివరిస్తూ, నాగేశ్వరరావు పరిశోధనను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అలహాబాద్ హైకోర్టు ‘అజయ్ సింగ్ vs ఉత్తరప్రదేశ్ రాష్ట్రం’ (2024) కేసులో కూడా వీరి వ్యాసాన్ని ఉటంకిస్తూ దర్యాప్తు సంస్థల అధికారాల పట్ల స్పష్టతనిచ్చింది. ఈ అరుదైన గౌరవం లభించినందుకు మెట్ పల్లి సీఐ వి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు నాగేశ్వరరావు ని కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. న్యాయ పరిశోధనలు కేవలం అకడమిక్ అంశాలుగానే కాకుండా, న్యాయస్థానాల తీర్పులకు దిశానిర్దేశం చేసే ‘ప్రెసిడెంట్స్’ గా మారడం గర్వకారణమని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు. ఒక నిబద్ధత కలిగిన న్యాయాధికారి చేసిన మేధోమథనం న్యాయవ్యవస్థకు ఇంతటి మేలు చేకూర్చడం పట్ల మెట్ పల్లి డివిజన్ ప్రజలు, న్యాయవాద వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

