ఏకిన్ పూర్ లో మిన్నంటిన ఆధ్యాత్మిక శోభ
శివాలెత్తిన శివసత్తులు.
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకిన్ పూర్ లో శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం కనులపండువగా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో భాగంగా ఒగ్గు కళాకారులు వేసిన మల్లన్న పట్నం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. డోలు వాయిద్యాలు, తలంబ్రాల పోకల మధ్య శివసత్తులు శివాలెత్తారు. శివనామ స్మరణతో ఏకిన్ పూర్ మార్మోగింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ జాతరలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి దర్శనానంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పట్టణ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం భక్తులు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు తెడ్డు విజయ్, ఊరుమడ్ల వెంకటి, కాశి రెడ్డి వెంకటా రెడ్డి, మ్యాదరి లక్ష్మణ్, ఎల్లేందుల శ్రీధర్, బన్న రాజేష్, చొప్పరి శంకర్, జగిలాం భాస్కర్, మ్యాదరి రాజేష్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


