నెలలు గడిచిన పట్టించుకొని మున్సిపల్ అధికారులు
నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం (కాలేజీ గ్రౌండ్)లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు అలంకారప్రాయంగా మారాయి.గత కొన్ని నెలలుగా వ్యాయామ పరికరాల హ్యాండిల్స్ విరిగిపోయి దర్శనమిస్తుండటంతో, ఫిట్నెస్ కోసం వచ్చే పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాలేజి గ్రౌండ్లో వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ వందలాది మంది యువకులు, వృద్ధులు మరియు మహిళలు ఇక్కడకు వచ్చి వ్యాయామం చేస్తుంటారు. అయితే, సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రధానమైన హ్యాండిల్స్ విరిగిపోయి నెలలు గడుస్తున్నా, అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేద్దామని ఆశతో గ్రౌండ్కు వస్తే, ఇక్కడ విరిగిపోయిన పరికరాలను చూసి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. చిన్న మరమ్మతులే కదా అని వదిలేయకుండా, విరిగిపోయిన హ్యాండిల్స్కు వెంటనే వెల్డింగ్ లేదా కొత్తవి అమర్చాలి.ఇతర పరికరాలు కూడా తుప్పు పట్టకుండా క్రమ పద్ధతిలో నిర్వహణ చేపట్టాలి. ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ వ్యాయామ పరికరాలకు మరమ్మతులు చేయించి ఓపెన్ జిమ్ తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు, వాకార్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.


