హోటళ్లు,టిఫిన్ సెంటర్లలో తనిఖీలు. రూ.12 వేల జరిమానా
నవగీతం కోరుట్ల ప్రతినిధి:
పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు.కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం మున్సిపల్ అధికారులు పట్టణంలోని పలు రెస్టారెంట్లు,హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లతో పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు రూ. 12,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని వ్యాపారులు తక్షణమే నిలిపివేయాలన్నారు. ప్లాస్టిక్ బదులు బట్ట సంచులను ప్రోత్సహించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అలాగే, ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిన వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. వ్యాపార సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలను తడి,పొడి,హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఎస్ డబ్యు యం -2019 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్,అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు మహేష్, హేమంత్,జవాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


