జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహణ
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ వీక్–2026 కార్యక్రమాలు కొడిమ్యాల మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాచుపల్లిలోని జేఎన్టీయూహెచ్. యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల కళాశాలలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్కు బోధన, బోధనేతర సిబ్బంది విశేషంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. జితేందర్, డాక్టర్ పి.శివాని సిబ్బందికి బీపీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.అనంతరం సంబంధిత పరీక్షల రిపోర్టులను అందజేసి, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ఉద్యోగ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని వైద్యులు తెలిపారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని హెల్త్ క్యాంప్ను విజయవంతం చేశారు.


