నవగీతం ,కోరుట్ల ప్రతినిధి(వి.సంపత్)
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆధునిక అభ్యుదయ పథంలో నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.దేశంలో టెలికాం, సమాచార సాంకేతిక (ఐటీ) రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, అధికార వికేంద్రీకరణే ధ్యేయంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.యువత దేశ భవిష్యత్తును నిర్ణయించేలా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, శాంతిభద్రతల పరిరక్షణకు, దేశ సమగ్రతకు ఆయన చేసిన త్యాగాలు అమూల్యమైనవని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆయన ఆశయాలను, ఉన్నతమైన ఆలోచనలను భావి తరాలకు కలుపుతూ, సమాజ ప్రగతికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండేలా తాము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా కృష్ణారావు స్పష్టం చేశారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి కౌన్సిలర్ లు తెడ్డు విజయ్, రహీం, చిట్యాల లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ సంఘ లింగం, నజ్జు, నాయకులు ఏలేటి మహిపాల్ రెడ్డి, ఖయ్యూం, బన్న రాజేష్, వెంకటి, రాకేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, మహేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


