నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక – 99” రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుంచి విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్య వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఆదివారం రోజున బోధన, బోధనేతర సిబ్బంది సమక్షంలో విద్య వారోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఏడు రోజుల పాటు జరుగనున్న విద్య వారోత్సవ వేడుకలలో భాగంగా కళాశాల స్థాయిలో ప్రజా పాలన, ప్రగతి-ప్రణాళిక బ్యానర్,బ్రౌచర్ ల ఆవిష్కరణ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో విద్యార్థులకు శిక్షణ,అదే విధంగా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహణ,తల్లిదండ్రుల సమావేశం నిర్వహణ,గ్రంథాలయ పుస్తక ప్రదర్శన,కృత్రిమ మేధస్సుతో పాటు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, అర్హత గల విద్యార్థులకు మరియు కళాశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు సన్మానం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన వివరించారు.విద్య వారోత్సవ వేడుకలను విజయవంతం చేయటానికి సమిష్టి కృషి చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య కళాశాల సిబ్బందికి మరియు విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య వారోత్సవ వేడుకలను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, దోస్త్ కో- ఆర్డినేటర్ ఏ. మనోజ్ కుమార్, కామర్స్ లెక్చరర్ ఏ.అంజయ్య, బోధనేతర సిబ్బంది జుంబర్తి లక్ష్మీనారాయణ, అటుకుల బాబు,వై.శ్రీనివాస్, గొర్రె లింగం తదితరులు పాల్గొన్నారు.

